తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఇటీవల ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఒక్క చంద్రబాబు మాత్రమే నిజంగా పోరాడుతున్నారని సర్టిఫికేట్ ఇచ్చారు.
	
 
									
										
								
																	
	 
	చంద్రబాబు ఒక్కరే హోదా కోసం పోరాడుతున్నారు. అందుకే కేంద్రం ఆయన్ను లక్ష్యంగా చేసుకుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం కక్షసాధింపు చర్యలు చేపట్టడం అందులో భాగమేనని వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	రాహుల్గాంధీ ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని వీహెచ్ అన్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల విషయంలో ఆయన తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.
 
									
										
								
																	
	 
	తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన వీహెచ్.. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ అగ్రకులాల పెత్తనమే సాగుతుందని విమర్శలు గుప్పించారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	నిజమైన కాంగ్రెస్ వాదులను పక్కనపెట్టి పార్టీలు మారుతున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి అంశాలన్నింటిపై దృష్టిసారించి రాహుల్ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.