Publish Date: Fri, 18 Feb 2022 (15:24 IST)
Updated Date: Fri, 18 Feb 2022 (15:25 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఎలుగెత్తి చాటారని గుర్తుచేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తొలగించేటపుడు, ఆ తర్వాత 2022 బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఏపీ విభజన రోజు బ్లాక్ డే అంటూ పేర్కొన్నారని అరుణ్ కుమార్ గుర్తుచేశారు. అందువల్ల ఏపీ విభజన తీరుపై ఇపుడు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విభజనపై ఏం మాట్లాడారో దీనిపై సుప్రీంకోర్టులో కేసు కూడా వేసినట్టు ఆయన వెల్లడించారు. దీని గురించి కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించినట్టు తెలిపారు. దీనిపై చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ఏం చేయలేదని విమర్శించారు. విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, ఏబీ విభజన, పోలవరం అంశాలపై సుధీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అరుణ్ కుమార్ సూచించారు.