కడపలో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుమార్తెను వేధిసున్నాడనే ఆగ్రహంతో అల్లుడిని మామ పొట్టనబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కడన ఆర్కే నగర్కు చెందిన చాంద్ బాషాకు, అశోక్నగర్లో నివాసముంటున్న మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.
అయితే వివాహం జరిగినప్పటి నుంచి ఆయేషాను చాంద్ బాషా వేధించాడు. ఈ వ్యవహారంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కుమార్తెను చాంద్ బాషా వేధింపులు కొనసాగుతూ వచ్చాయి.
అంతేగాకుండా భార్యతో విభేదాల కారణంగా చాంద్ బాషా గత రెండు సంవత్సరాలుగా ఆమెకు దూరంగా ఆర్కే నగర్లో నివాసం ఉంటున్నాడు. అల్లుడు చాంద్ బాషా తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని ఆయేషా తండ్రి మహబూబ్ బాషా ఆగ్రహంతో రగిలిపోయాడు.
20 రోజుల క్రితం కువైట్ నుండి వచ్చిన ఆయేషా తండ్రి మహబూబ్ బాషా అల్లుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడిని కిడ్నాప్ చేసి చంపేశాడు. హత్య అనంతరం మహబూబ్ బాషాతో పాటు మరికొందరు చిన్నచౌకు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.