Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివేకా హ‌త్య కేసులో నార్కో ప‌రీక్ష‌ల‌కు స‌సేమిరా అంటున్న ఉమాశంక‌ర్ రెడ్డి

వివేకా హ‌త్య కేసులో నార్కో ప‌రీక్ష‌ల‌కు స‌సేమిరా అంటున్న ఉమాశంక‌ర్ రెడ్డి
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:26 IST)
కడప జిల్లా పులివెందుల‌లో వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో నార్కో పరీక్షకు ఉమాశంకర్‌రెడ్డి  అనుమ‌తించ లేదు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొన‌సాగుతోంది. ఈ హత్య కేసులో సీబీఐ వేసిన నార్కో పిటిషన్​ను పులివెందుల కోర్టు డిస్మిస్ చేసింది. నిందితుడు ఉమాశంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇవాళ పులివెందుల మెజిస్ట్రేట్ విచారణ జరిపారు. 
 
రిమాండు ఖైదీగా కడప కారాగారంలో ఉన్న ఉమాశంకర్ రెడ్డిని దూరదృశ్య మాధ్యమం ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణలో భాగంగా నార్కో పరీక్షలు చేయించుకోవడం సమ్మతమేనా అని పులివెందుల మెజిస్ట్రేట్ అడగగా, అందుకు తాను సుముఖంగా లేనని ఉమాశంకర్ చెప్పారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్​ను మెజిస్ట్రేట్ తిరస్కరించారు. గతంలో సునీల్ యాదవ్ కు నార్కో పరీక్షలు నిర్వహించడానికి వేసిన పిటిషన్​ను కూడా జమ్మలమడుగు కోర్టు తిరస్కరించింది. వారం కిందట మున్నా అనే వ్యక్తికి నార్కో పరీక్షలు చేయించడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ వేసిన పిటిషన్​పై అతని సమ్మతితో కోర్టు అనుమతి మంజూరు చేసింది.
 
కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పులివెందుల ఆర్టీసీ బస్టాండు ఎదురుగా మహాశివగంగభవాని పాల డెయిరీ నిర్వహిస్తున్నారు. అతను వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటూ, పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డికి తమ్ముడు. వీరికి మొదటి నుంచి వివేకా, ఆయన కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సింహాద్రిపురం మండలం రావులకొలనులో వివేకా పొలాలను, మినీ పాల కేంద్ర నిర్వహణ బాధ్యతలను జగదీశ్వర్‌రెడ్డి చూస్తున్నారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్ కుమార్ యాదవ్‌ను ఉమాశంకర్‌రెడ్డే వివేకాకు పరిచయం చేసినట్లు సమాచారం.
 
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో గజ్జల ఉమా శంకర్ రెడ్డి, యాదాటి సునీల్ కుమార్ యాదవ్‌ పాత్ర ఉన్నట్లు సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. 2019 మార్చి 14వ తేదీ (హత్యకు ముందు రోజు) రాత్రి వారిద్దరూ వివేకా ఇంటి వద్దకు ద్విచక్రవాహనంపై వచ్చారని, అనంతరం అదే వాహనంలోని సైడు బ్యాగులో వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి దాచుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిపింది. 
 
వాహనాన్ని ఈ ఏడాది ఆగస్టు 8న స్వాధీనం చేసుకున్నామని, దాని సైడు బ్యాగును గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇతర సంస్థలకు పంపించి శాస్త్రీయంగా ఈ వివరాలు ధ్రువీకరించామంది. కేసు దర్యాప్తునకు సహకరించట్లేదని ఉమాశంకర్‌రెడ్డి (37)ని గురువారం మధ్యాహ్నం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పులివెందుల జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. దీంతో ఉమాశంకర్‌రెడ్డిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఉమాశంకర్‌రెడ్డిని అయిదు రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది.
 
నార్కో పరీక్షలకు మున్నా అంగీకారం తెలిపాడు. మున్నాను పులివెందుల కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు.. నార్కో పరీక్షల కోసం పిటిషన్‌ వేశారు. నార్కో పరీక్షలకు మేజిస్ట్రేట్ ఎదుట మున్నా అంగీకారం తెలపడంతో సీబీఐకి పులివెందుల కోర్టు అనుమతిచ్చింది. గతేడాది మున్నాకు చెందిన రూ.50 లక్షలకు పైగా నగదును సీబీఐ అధికారులు గుర్తించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నించారు.  వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు. ఇప్పటికే పలుమార్లు దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు దస్తగిరి పని మానేశాడు. ఇతడు ఇచ్చిన కొన్ని కీలక ఆధారాలతో సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతున్న కరోనా మరణాలు - తగ్గుతున్న పాజిటివ్ కేసులు