Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో క్వారంటైన్ కేంద్రాలుగా పర్యాటక హోటళ్లు

ఏపీలో క్వారంటైన్ కేంద్రాలుగా పర్యాటక హోటళ్లు
, శనివారం, 1 ఆగస్టు 2020 (17:25 IST)
ఆదాయం పెంపుదలలో భాగంగా పర్యాటక హోటళ్లను కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలుగా నిర్వహణకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతిస్తామని, అదే నెల 15వ తేదీ నుంచి బోటు టూరిజం ప్రారంభించనున్నామన్నారు.

త్వరలో నూతన పర్యాటక పాలసీని తీసుకొస్తున్నామన్నారు. సచివాయలంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిందని, దీనివల్ల ముఖ్యంగా ఆదాయం పడిపోయిందని అన్నారు. పర్యాటక రంగంలో ఆదాయం పెంపుదలకు చర్యలు చేపట్టామన్నారు.

దీనిలో భాగంగా తక్కువ ఆక్యూపెన్సీ ఉన్న పర్యాటక హోటళ్లను కొవిడ్ క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ కోసం అద్దెకు ఇవ్వనున్నామన్నారు. ఇప్పటికే ప్రైవేటు హోటళ్లు ఎన్నో కొవిడ్ ఆసుపత్రుల నిర్వహణకు అద్దె కోసం ఇచ్చారన్నారు. ఈ మార్గంలోనే నెల్లూరులోని పర్యాటక హోటల్ ను కొవిడ్ క్వారంటైన్ కేంద్రానికి ఇవ్వగా, రూ.2 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల సందర్శనకు అమనుతిస్తామన్నారు. ఆగస్టు 15 వ తేదీ నుంచి బోటు టూరిజానికి అనుమతివ్వనున్నామన్నారు. దీనిలో భాగంగా పర్యాటక ప్రాంతాలను సిద్ధం చేయాలని 13 జిల్లాల పర్యాటక శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశించామన్నారు.

త్వరలో నూతన టూరిజం పాలసీ....
ఏపీలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. అడ్వెంచర్ టూరిజం చిత్తూరులోని హార్సలీ హిల్స్ లో ఉందని, అదే బాటలో రివర్ టూరిజం, బీచ్ టూరిజంతో పాటు ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతితో త్వరలో నూతన టూరిజం పాలసీని తీసుకురానున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పది 5 స్టార్, 7 స్టార్ హోటళ్ల నిర్మించనున్నామన్నారు. రాష్ట్రంలో రూ.1000 కోట్ల విలువైన పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి వెల్లడించారు. 

సీఎం జగన్ చేతుల మీదుగా ‘ప్రసాద్‘ పథకానికి శ్రీకారం...
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రసాద్ పథకం కింద సింహాచలం దేవస్థానం ఎంపికవ్వడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆనందం వ్యక్తంచేశారు. తిరుపతి, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలను ప్రసాద్ పథకం కింద సిఫార్సు చేశామన్నారు. వాటిలో సింహాచలం దేవస్థానాన్ని ప్రసాద్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. మరిన్ని దేవాలయాలను ప్రసాద్ పథకం కింద గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంతో తమ అధికారులు చర్చించనున్నారన్నారు.

ప్రసాద్ పథకం కింద రూ.53 కోట్ల విలువైన  పనులను సింహాచలం దేవస్థానంలో చేపట్టాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కింద ఎంపికైన శ్రీశైలం దేవస్థానంతో పాటు సింహాచలం దేవస్థానంలో పనులను త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 

రూ.12 కోట్లతో 4 క్రీడా వికాస్ కేంద్రాలు...
రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో రూ.12 కోట్లతో నాలుగు క్రీడా వికాస్ కేంద్రాలు ప్రారంభించనున్నామన్నారు. వాటిలో  గుంటూరు జిల్లాలోని బాపట్ల, తెనాలి, మాచర్లలో 3, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఒక క్రీడా వికాస్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

విశాఖలో పీవీ సింధు టెన్నిస్ అకాడమీకి భూమి కేటాయించాలని కలెక్టర్ ను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కొవిడ్ మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో జిమ్ ల ప్రారంభానికి త్వరలో అనుమతులివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. జిమ్ లను షిఫ్ట్ ల పద్ధతిలో నిర్వహణకు అనుమతులిస్తామన్నారు. ఖేల్ ఇండియాలో భాగంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని మంత్రి తెలిపారు. 

వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహాకాలకు దరఖాస్తుల ఆహ్వానం...
రాష్ట్రంలో పేద క్రీడాకారులకు అండగా నిలవాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహాకాల పథకం కింద గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రూ.3 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.

జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, వెండి పతక విజేతకు రూ.3 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.2 లక్షల చొప్పున్న ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహాకాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో టూరిజంతో పాటు క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాకు బలి..అధికార లాంఛనాలతో అంత్యక్రియలు