Publish Date: Sat, 05 Sep 2020 (13:09 IST)
Updated Date: Sat, 05 Sep 2020 (13:10 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టిక్ టాక్ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటరులో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళగిరికి చెందిన పవన్ కుమార్, చిత్తూరు జిల్లాకు చెందిన శైలజలకు టిక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతం గత నెల 3న తిరుపతిలో వీరు పెళ్లి చేసుకుని, ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త కాపురాన్ని ప్రారంభించారు.
అదేసమయంలో శైలజ తల్లిదండ్రులు రంగప్రవేశంచేసి.. పవన్ను వదిలేసి రావాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి శైలజ ఫోన్ వాడటాన్ని కూడా మానేసింది. అనంతరం పవన్కు శైలజ బంధువులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరింపులకుదిగారు.
దీంతో భయపడిపోయిన ఈ ప్రేమజంట... ఇక మనల్ని బతకనివ్వరని భావించారు. పైగా, పెద్దల బెదిరింపుల కారణంగా కలిసి బతకలేని పరిస్థితి నెలకొందనే బాధలో చనిపోవడానికి సిద్ధమయ్యారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరోవైపు శైలజ సూసైడ్ లెటర్ రాసింది. తమ చావుకు తన తల్లి హేమలత, తండ్రి రవీంద్ర, బంధువు సుబ్రహ్మణ్యం కారణమని లేఖలో పేర్కొంది. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.