Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిపోర్టర్ కేశవ్ హత్యపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన డి‌జి‌పి

Advertiesment
DGP
, సోమవారం, 9 ఆగస్టు 2021 (11:28 IST)
కర్నూలు జిల్లా నంద్యాలలో రిపోర్టర్ కేశవ్ హత్య ఘటనపైన సమగ్ర దర్యాప్తుకు ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ఆదేశించారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్‌తో పాటు  హత్య తో ప్రమేయం ఉన్న అందరి పైనా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. ముద్దాయిలను వెంట‌నే అరెస్టు చేసి , కఠిన చర్యలు తీసుకోవాలని డి‌జి‌పి కార్యాల‌యం నుంచి ఒక నోట్ జిల్లా పోలీస్ అధికారికి వెళ్ళింది.
 
కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక యూట్యూబ్ ఛాన‌ల్ రిపోర్టర్ కేశవ్‌ను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ఈ హ‌త్య చేసింది ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబులే అని పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు.
 
నంద్యాలలో ఆదివారం రాత్రి జరిగిన దారుణ హత్యలో విలేఖరి కేశవ్ మృతి చెందాడు. స్క్రూ డ్రైవర్ తో కేశవ్ ను ఎనిమిది చోట్ల దారుణంగా పొడవడంతో, అత‌ను మృతి చెందాడు. మట్కా వ్యవహారంలో సామాజిక మాధ్యమాలలో ఇటీవల ఒక వీడియో వైరల్ కావడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ స‌స్పెండ్ అయ్యాడు. వి5 అనే యూట్యూబ్ ఛాన‌ల్ లో ఈ వీడియో రావడంతో, క‌క్ష పెంచుకున్న ఆ కానిస్టేబుల్, అత‌ని తమ్ముడు కేశ‌వ్ పై పాశ‌విక దాడికి పాల్ప‌డ్డారు. స్క్రూ డ్రైవర్ తో కేశవ్ ను ఎనిమిది చోట్ల పొడవడంతో మృతి చెందాడు.
 
హ‌త్య‌చేసిన కానిస్టేబుల్, అత‌ని త‌మ్ముడు పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని క‌ర్నూలు  జిల్లా ఎస్పీ సుదీర్ కుమార్ రెడ్డి తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెప్పారు. ఏ ఒక్క జర్నలిస్ట్ కు ఆపద వ‌చ్చినా, తాను సాయం చేస్తాన‌ని భరోసా ఇచ్చారు. అయితే, ఈ హ‌త్య‌కు కారణమైన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాల‌ని జ‌ర్న‌లిస్టు సంఘాలు డిమాండు చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అప్పు, పెద్ద త‌ప్పు కాదంటున్న వైసీపీ