తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఇథనాల్ చిచ్చు చెలరేగింది. పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
జిల్లాలోని పెద్ద ధన్వాడ గాయత్రి కంపెనీ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని అయితే, ఈ పరిశ్రమ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 12 గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు. మంగళవారం కంపెనీ ప్రతినిధులు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూలీలను తీసుకునిరావడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పరిశ్రమ ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ ఆందోళనకారులు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, గుడారాలను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పనులు చేసేందుకు వచ్చిన వలస కూలీలపై రాళ్లతో దాడి చేయడంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించింది.