Publish Date: Wed, 27 May 2020 (21:02 IST)
Updated Date: Wed, 27 May 2020 (21:07 IST)
లాక్డౌన్ తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తోంది. కర్ణాటకలో జూన్ 1వ తేదీ నుంచి దేవాలయాలు తెరుచుకోనున్నాయి. నిర్థిష్ట మార్గదర్శకాలను అనుసరించి ఆలయాల్లోకి భక్తులకు అనుమతిస్తారు.
కోవిడ్-19 కారణంగా దేవాలయాల్లోకి భక్తులను రెండు నెలలకు పైగా అనుమతించని విషయం తెలిసిందే. ఆలయాలు తెరిచే విషయమై కర్ణాటక సీఎం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది.
అనంతరం ఆ రాష్ట్ర మంత్రి కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ.. జూన్ 1 నుంచి ఆలయాలను తెరుస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి 52 దేవాలయాల్లో ఆన్లైన్ బుకింగ్ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు.
అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. పరిస్థితులను అనుసరించి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు.