Publish Date: Sun, 29 Aug 2021 (11:02 IST)
Updated Date: Sun, 29 Aug 2021 (11:03 IST)
'దేశభక్తి అంటే మాతృభాష మీద అభిమానమే. మాట్లాడుతున్న భాషను కాదని మృతభాషను పూజించడం ఎలాంటిదంటే, ఆకలితో మాడిచస్తున్న సాటి మనిషికి అన్నం పెట్టకుండా, చనిపోయినవారి పేరుతో శ్రాద్ధ భోజనం పెట్టడం లాంటిది' అని గిడుగు రామమూర్తి అన్నారు.
ఈయన జయంతిని ప్రతి యేటా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈయన తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా గుర్తింపు పొందారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలునూ తెలియజెప్పిన మహనీయుడు.
ఆంధ్రప్రదేశ్ వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహు భాషావేత్త. చరిత్రకారుడు. సంఘసంస్కర్త. హేతువాది. శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చరపిడుగు మన గిడుగు రామమూర్తి. ఈయన చేపట్టిన ఉద్యమం వల్ల ఏ కొందరికో పరిమితమైన చదువు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందుకే గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.