Publish Date: Mon, 26 Feb 2024 (22:05 IST)
Updated Date: Mon, 26 Feb 2024 (22:05 IST)
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మంగళవారం నుంచి మరో రెండు హామీలను అమలు చేసేందుకు నడుంబిగించింది. ఇందుకోసం ఆహ్వాన పత్రికను కూడా ముద్రించింది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రికను ముద్రించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు హాజరవుతారు.
ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో జరుగనుందని ఆహ్వాన పత్రికలో ముద్రించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఆ పత్రికలో పేర్కొంది.
కాగా, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలుచేసింది. ఈ పథకానికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ పథకం అమలుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు తమకు ఉపాధి పోయిందని వాపోతూ, వివిధ రకాలైన ఆందోళనలు చేస్తున్నారు. ఇపుడు మరో రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.