Publish Date: Thu, 20 Feb 2020 (09:01 IST)
Updated Date: Thu, 20 Feb 2020 (09:03 IST)
వేతన సవరణ కమిషన్ గడువు పెంపుతో ఉద్యోగులు ఆందోళన చెందొద్దన్నారు ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి. త్వరలోనే పీఆర్సీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పీఆర్సీ కమిషన్ గడువు పెంపు నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను కలిశారు.
పీఆర్సీ ఇవ్వడమే కాకుండాఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరినట్లు ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తెలిపారు. కమిషన్ గడువు పెంపుతో ఉద్యోగులు ఆందోళన చెందిన విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లమన్నారు.
ఉద్యోగులకు సంబంధించిన అనేక ఇతర విషయాలపై అధ్యయనం కోసమే వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేశారని... పీఆర్సీ నివేదిక కూడా సిద్ధంగా ఉందని రవీందర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే పీఆర్సీ వస్తుందని సీఎస్ సోమేశ్ కుమార్ కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకమార్లు చెప్పారని గుర్తుచేశారు. త్వరలోనే ఉద్యోగసంఘాలను పిలిచి సీఎం మాట్లాడతారని, గౌరవప్రదమైన పీఆర్సీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని... ఒకవేల పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం చేస్తామన్నారు.