Publish Date: Wed, 09 Mar 2022 (11:34 IST)
Updated Date: Wed, 09 Mar 2022 (11:37 IST)
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి టీడీపీ సానుభూతిపరుడుగా వుంటూ వస్తున్న 39 ఏళ్ల వ్యక్తి తన వ్యవసాయ భూమికి వెళ్లి అక్కడ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మందసలోని పొట్టంగికి చెందిన కోన వెంకటరావు మృతి రాజకీయ వేధింపులే కారణమీ, వైసిపి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడంటూ స్థానిక టీడీపీ నేతలు, కుటుంబసభ్యులతో కలిసి పలాస ప్రభుత్వాసుపత్రిలో ధర్నా చేశారు.
మరోవైపు పోలీసుల వేధింపులు కూడా అతడి ఆత్మహత్యకు కారణమయ్యాయని ఆరోపించారు. గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్తో పాటు సర్పంచ్ అభ్యర్థి కె.అప్పన్నను బెదిరించిన వెంకటరావుపై నాలుగు రోజుల క్రితం టెక్కలి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
మీడియాతో ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులు పెట్టిన కేసు వెంకటరావుపై క్రిమినల్ కేసు నమోదు చేశాం. మా సిబ్బంది అతని ఇంటికి వెళ్లినప్పుడు అతను ఇచ్ఛాపురంలో ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడనీ, టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ ఎస్పీ కొట్టిపారేశారు.