వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డ సవాల్ విసిరారు. గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో అరటి పంటకు బీమా చెల్లించినట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అలా నిరూపించకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు.
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్.. పులివెందుల రైతుల వెన్ను విరిచాడని మండిపడ్డారు. 2019-24 మధ్య రాయలసీమకు అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇచ్చినట్లు జగన్ చూపగలరా అని ప్రశ్నించారు. త్వరలోనే అరటి రైతుల సమస్య పరిష్కారమవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు.
గత 2019-24 మధ్య రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఎందుకు జరిగాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పంట విస్తీర్ణం పెరిగి, ఉత్తరాది నుంచి ఎక్కువ దిగుబడి రావటం కారణంగా అరటి రైతులు తాత్కాలిక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జగన్ అరాచకాల వల్లే పులివెందుల బనానా ప్రాసెసింగ్ యూనిట్ మనుగడలోకి రాలేదని చెప్పారు. జగన్ అసెంబ్లీకి వస్తే అన్ని వాస్తవాలు బయటపెడతామన్నారు.
వైకాపా నేతలను క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం : పవన్ కళ్యాణ్
వైకాపా నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారానికి దూరమైనప్పటికీ వైకాపా నేతల బూతులు, బుద్ధి మారడం లేదన్నారు. భవిష్యత్లో కూడా ఇలాగే వ్యవహరిస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. పైగా, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారిని క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఏపీలో వైకాపా ఇకపై అధికారంలోకి రాదన్నారు. అందువల్ల వైకాపా నేతలు అధికారంపై ఆశలు పెట్టుకోవద్దన్నారు.
కోనసీమ జిల్లా రాజోలులో నిర్వహించిన పల్లె పండుగ 2.0లో ఆయన పాల్గొన్నారు. అలాగే, శంకరగుప్తం డ్రెయిన్ కారణంగా నష్టపోయిన కేశనపల్లి కొబ్బరి రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, వారి గొంతుకనవుతానని హామీ ఇచ్చారు. కేవలం 22 కోట్ల రూపాయలు ఇచ్చి హడావుడి చేసేందుకు తాను రాలేదన్నారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమ వ్యాప్తంగా ఉన్న డ్రెయిన్ల సమస్యపై పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తానని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు తెలియజేస్తున్నాం. అబద్ధపు మాటలు చెబితే యువత నమ్మరు అని ఆయన వ్యాఖ్యానించారు.