ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నగరం, నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వెయిటింగ్ హాలులోకి వెళ్లారు. విచారణ ప్రారంభంకాగానే కోర్టు సిబ్బంది "ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి" అంటూ పిలిచారు. ఆ వెంటనే జగన్ కోర్టు హాల్లోకి ప్రవేశించి, న్యాయమూర్తికి నమస్కరించారు.
ఆ తర్వాత న్యాయమూర్తి సూచన మేరకు హాజరుపట్టికలో సంతకం చేసారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ కోర్టు నుంచి బయటకు వెళ్లేందుకు న్యాయమూర్తి రఘురాం అనుమతి ఇచ్చారు. విచారణ సందర్బంగా జగన్ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరును మాత్రమే జడ్జి పరిగణలోకి తీసుకుని సంతకం చేయించుకుని పంపించివేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరుగనుంది. అలాగే, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎపుడు విచారణకు హాజరుకావాలనే అంశంపై కోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు, కోర్టు నుంచి బయటకు వచ్చిన జగన్ నేరుగా హైదరాబాద్ నగరంలోని లోటస్ పాండ్లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన బెంగుళూరుకు బయలుదేరి వెళతారు. కాగా, లోటస్ పాండ్ వద్ద వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అలాగే, అతికొద్ది మంది వైకాపా నేతలను లోటస్పాండ్లోకి అనుమతించారు. వీరితో జగన్ కొద్దిసేపు చర్చలు జరిపిన తర్వాత బెంగుళూరుకు బయలుదేరి వెళ్ళారు.