Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయి దాడికి తాడేపల్లి ప్యాలెస్ ముందే స్క్రిప్ట్ : టీడీపీ నేత కె.పట్టాభి

Pattabhiram

వరుణ్

, ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (13:12 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా, శనివారం రాత్రి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాయిదాడికి కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్టు మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌లోనే తయారు చేశారని టీడీపీ సీనియర్ నేత కె.పట్టాభిరాం ఆరోపించారు. ఈ రాయి దాడి డ్రామాలో హీరో జగన్‌, సైడ్‌ హీరో ఎమ్మెల్యే వెలంపల్లి అని ఎద్దేవా చేశారు. ఎవరి పాత్రలను వారు అద్భుతంగా పోషించారన్నారు. 
 
ఈ దాడి అంశంపై ఆయన ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు దాడి చేయించుకుని టీడీపీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. 
 
'ప్రజల ఛీత్కారాలతో ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే సానుభూతి కోసం కోడికత్తి తరహాలో డ్రామా ఆడారు. సీఎం కాన్వాయ్‌లో అంబులెన్స్‌ ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లకుండా బస్సులోకి ఎందుకు తీసుకెళ్లారు? అందులో కూర్చోబెట్టి ప్లాస్టర్‌ వేస్తున్న దృశ్యాలను ప్రసారం చేశారు కానీ.. అంబులెన్స్‌ను ఎందుకు ఉపయోగించుకోలేదు? దీనికి సమాధానం చెప్పాలి' అని పట్టాభి డిమాండ్‌ చేశారు. 
 
సీఎం జగన్‌పై రాయితో దాడి.. ఎన్నికల సంఘం ఆరా!! 
 
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై చిన్నపాటి రాయితో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన ఎడమ కన్ను పైభాగంలో చిన్నపాటి దెబ్బ తగిలింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా ఆరాతీశారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పైగా, ఈ దాడి నేపథ్యంలో జగన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ దాడి శనివారం రాత్రి జరిగింది. ఆదివారం కావడంతో దాడిని సాకుగా చూపించి బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారన్న వ్యాఖ్యానాలు కూడా విపక్ష నేతల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే, తదుపరి యాత్రపై వైకాపా ఆదివారం క్లారిటీ ఇవ్వనుంది. 
 
మరోవైపు, విజయవాడ సీపీతో మాట్లాడిన ముఖేశ్ కుమార్ మీనా... ఏం జరిగిందన్న దానిపై ఆదివారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిందితులు త్వరగా గుర్తించాలని సీపీని సూచించారు. మరోవైపు, రాయిదాడిలో చిన్నపాటి గాయం తగిలిన జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నుదుటిపై వాపు ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం తన యాత్రకు ఆదివారం విరామం ఇచ్చారు. యాత్ర తదుపరి షెడ్యూల్‌పై వైకాపా ఆదివారి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధికారంలోకి వస్తే పెట్రోల్ - డీజిల్ ధరలు తగ్గిస్తాం : ప్రధాని మోడీ ఎన్నికల హామీ