Publish Date: Wed, 28 Jul 2021 (08:41 IST)
Updated Date: Wed, 28 Jul 2021 (08:49 IST)
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు ను అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తనపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ.. తన ఫిర్యాదును తీసుకోవాలంటూ దేవినేని ఉమా జీ.కొండూరు పోలీస్స్టేషన్ వద్దకు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు తీసుకునే దాక తాను కదిలేది లేదంటూ కారులోనే కూర్చున్నారు.
సుమారు ఆరు గంటల పాటు కారులోనే కూర్చొన్నారు. అయితే.. అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయన్ను బలవంతంగా అదుపులో తీసుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి డోరు తెరిచి అదుపులో తీసుకున్నారు. అక్కడ నుంచి పెదపారుపూడి పోలీస్స్టేషన్కు తరలించారు.
పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఫిర్యాదు తీసుకోకుండా అదుపులో తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన జరుగుతోందనడానికి మైలవరంలో జరిగిన ఘటన ఉదాహరణ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
అంతకముందు దేవినేని ఉమా వాహనంపై వైసీపీ వర్గీయులు మంగళవారం రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు.
వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదును తీసుకోవాలంటూ దేవినేని ఉమా జీ.కొండూరు పోలీస్స్టేషన్ వద్దకు ఆందోళనకు దిగారు.