Publish Date: Wed, 29 Sep 2021 (21:57 IST)
Updated Date: Wed, 29 Sep 2021 (21:59 IST)
తాము అధికారంలో ఉండగా కాకినాడను స్మార్టుసిటీగా అభివృద్ధి చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నగర పరువు అంతర్జాతీయ స్థాయిలో తీశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు.
జిల్లా టిడిపి కార్యాలయంలో వనమాడి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని పోర్టులో 70 కోట్ల విలువ చేసే హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలకు సంబంధించి అధికారులు కాకినాడతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ వ్యవహారం అంతా సిటీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగిందని, అందుకే సీఎం జగన్ నోరు మెదపడంలేదన్నారు.
అలాగే గత నెలలో సుమారు ఇరవై ఐదు రోజులు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారనే విషయం నగర ప్రజలకు చెప్పాలని వనమాడి డిమాండ్ చేశారు. ఈ మాదకద్రవ్యాల వ్యవహారం పక్కదారి పట్టించడానికి సినీ నటుడు పోసాని కృష్ణ మురళితో ఇతర పార్టీలతో, వారి నాయకులపై దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు.
మాదకద్రవ్యాల వ్యవహారంపై తాలిబన్ నుంచి తాడేపల్లి వరకు కాకినాడ మాదకద్రవ్యాల కోసమే నగర ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. తక్షణమే సిటీ ఎమ్మెల్యే నోరు విప్పాలని వనమాడి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో టిడిపి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, నృసింహదేవర విశ్వనాథం, ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు.