Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రం మొత్తం ఏదో వేవ్ కనిపించింది.. జగన్ కోసం మహిళలు వచ్చారా?

రాష్ట్రం మొత్తం ఏదో వేవ్ కనిపించింది.. జగన్ కోసం మహిళలు వచ్చారా?
, శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (14:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో వేవ్ కనిపించిందని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అదేసమయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం మహిళలు తరలి వచ్చారని చెప్పడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఏనాడన్నా పోలింగ్ సందర్భంగా ఉదయమే అంతమంది జనం రావడం ఎప్పుడైనా చూశామా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వచ్చిన వాళ్లలో ఉన్న ఉత్సాహం కాసేపటికే చల్లారిపోయిందని, పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. 
 
దాంతో వెనక్కివెళ్లిపోయి మళ్లీ వచ్చినా అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. ఇలా మూడుసార్లు జరిగిందని ఆరోపించారు. ఉదయం భారీగా జనాలు తరలిరావడం చూస్తుంటే రాష్ట్రంలో మొత్తానికి ఏదో వేవ్ కనిపించిందన్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయన్నారు. చివరకు ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సైతం ఓటు వేయలేక పోయారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
'ఈవీఎంలను రిపేర్ చేయడానికి ఎవరెవరో వచ్చారు. వాళ్లు ఈవీఎంలు బాగుచేయడానికి వచ్చారా? లేక కుట్రపూరితంగా వాటిలో ఏదైనా మార్పులు చేయడానికి వచ్చారా? ఈ రిపేర్ చేసేవాళ్లను ఎవరు అపాయింట్ చేశారు? ప్రజల భవిష్యత్తును ఓ యంత్రం చేతిలో పెడతారా?' అంటూ ప్రశ్నించారు. 
 
ఇకపోతే, వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోతున్నట్టు చెప్పారు. ఇందుకోసం శనివారం ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. వీవీ ప్యాట్‌లలో స్లిప్పులను లెక్కించడానికి ఆరు రోజులు ఎలా పడుతుందని ప్రశ్నించారు. స్లిప్పులు లెక్కించడానికి ఆరు గంటలు కూడా మించదన్నారు. 
 
బ్యాలెట్ పత్రాలను లెక్కించేందుకు గతంలో ఎంత సమయం పట్టేదో గుర్తు చేసుకోవాలని సూచించారు. దీనిపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తానని... ఏపీలో ఎన్నికల నిర్వహణపై ప్రశ్నిస్తానని చంద్రబాబు తెలిపారు. 
 
ఈవీఎంలు మొరాయించినప్పుడు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తానని చెప్పారు. ఏకధాటిగా రెండు గంటల పాటు ఈవీఎం పని చేయకపోతే రీపోలింగ్‌కు అవకాశముందని... అయినా ఈసీ పట్టించుకోవడం లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : శ్రీకాంత్ రెడ్డి