Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి ఆంధ్రుల హక్కు .. టీడీపీ గెలవకుంటే తలెత్తుకుని తిరగలేరు : చంద్రబాబు

అమరావతి ఆంధ్రుల హక్కు .. టీడీపీ గెలవకుంటే తలెత్తుకుని తిరగలేరు : చంద్రబాబు
, ఆదివారం, 7 మార్చి 2021 (13:13 IST)
అమరావతి ఆంధ్రుల హక్కు అని, దానికోసం జరిగే పోరాటానికి ఇంటికొక్కరు రావాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ 41వ డివిజన్‌లో ఆయన పర్యటించారు. అమరావతి కోసం విజయవాడ ప్రజలు ఇంటికొకరు రావాలని అన్నారు. అమరావతి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని, విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడాలని చెప్పారు. 
 
పట్టిసీమ నీటి లబ్ధిదారులు ఆలోచించాలన్నారు. విజయవాడ మేయర్‌గా ఖచ్చితంగా తెదేపా అభ్యర్థే ఉండాలని, లేదంటే ఇక్కడి ప్రజలకు తలెత్తుకు తిరగలేరన్నారు. 'ఇక్కడి మంత్రికి దుర్గమ్మపైనా భయం, భక్తి లేదు. విజయవాడలో తెదేపా గెలవకుండా మీరు తలెత్తుకు తిరగలేరు. రాష్ట్రాన్ని నేరస్తులు, గూండాల అడ్డాగా మార్చారు' అని విమర్శించారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను తీసేశారని దుయ్యబట్టారు.
 
అంతకుముందు శనివారం స్థానిక ఎన్నికల ప్రచారం కోసం విశాఖలో పర్యటించారు. జగదాంబ సెంటర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారం అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. భూమి విలువ చూసిన జగన్‌కు త్యాగం విలువ తెలియదన్నారు. అందుకే స్టీల్ ప్లాంటు భూములను విక్రయించాలని అంటున్నాడని ఆరోపించారు.
 
విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, వారి త్యాగాలకు జగన్ విలువ లేకుండా చేస్తున్నాడని విమర్శించారు. విశాఖ నగరపాలక ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రజలు అంగీకారం తెలిపినట్టు అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రౌడీలు, గూండాల నుంచి విశాఖను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తి కోసం తోడబుట్టిన వారిని హతమార్చిన తమ్ముడు