Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్

ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్
, సోమవారం, 28 డిశెంబరు 2020 (19:14 IST)
రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. కేంద్రం ఆమోదంతో రాష్ట్రంలో గిరిజనుల హక్కులను కాపాడేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులను జారీ చేసిందని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ కూడా నెరవేరిందని వివరించారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి కూడా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు రెండింటికి కలిపి ఒకే కమిషన్ ఉండేదని, అయితే ఈ కమిషన్ ద్వారా గిరిజనులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడంలేదన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక గిరిజన కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని సోమవారం మీడియాకు పుష్ప శ్రీవాణి తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలు రెండూ సమాజంలో అణిచివేతకు గురైనవే అయినా ఎస్టీలకు సంబంధించిన సమస్యలు ప్రత్యేకమైనవిగా ఉంటాయని చెప్పారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు చట్టాలపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో ఎక్కువగా అన్యాయానికి గురవుతుంటారని వాపోయారు. ఈ కారణంగానే గిరిజనులకు ఇచ్చే  6 శాతం రిజర్వేషన్లు కూడా మాకు కల్పించనటువంటి చరిత్రలు కూడా ఎన్నో ఉన్నాయన్నారు.

ఈ పరిస్థితుల్లోనే ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడిగా ఉండే కమిషన్ కారణంగా గిరిజనులకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి, దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపర్చడం జరిగిందని తెలిపారు.

తాను ఇచ్చిన హామీ ప్రకారంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను సిఎం ఆదేశాలతో చేపట్టడం జరిగిందని వివరించారు. 

ఎస్టీ కమిషన్ తో ఎంతో మేలు:
రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో గిరిజనులకు ఎనలేని మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద గిరిజనుల నుంచి వచ్చే ఫిర్యాదులు, చట్టం అమలులో అధికారుల ఉదాసీనత, 
నిర్లక్ష్యాలపై వచ్చే పిటిషన్లు విచారణ కమిషన్ చేస్తుందని చెప్పారు.

గిరిజనులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాల అమలుపై పరిశోధనలు, విశ్లేషణలు చేసి వాటిలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేసే అధికారం కూడా ఉంటుందన్నారు, గిరిజన భూముల పరాయీకరణ, వారికి సంబంధించిన ఇతర వనరులపై పరిరక్షణ విషయంలో ఉన్న చట్టాలు అమలయ్యేలా చూస్తుందని, ఆక్రమణలను నిరోధిస్తుందని పుష్ప శ్రీవాణి వివరించారు.

గిరిజన మహిళలు సమాజంలో ఎదుర్కొనే వివక్ష ఇతర అత్యాచారాలపై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని, పిటీషన్ల విచారణలో సమన్ల జారీ, సాక్ష్యాల నమోదు తదితర సివిల్ కోర్టుకు ఉండే అధికారాలన్నీ కమిషన్ కు ఉంటాయని తెలిపారు. గిరిజన హక్కులసై అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా కమిషన్ నిర్వహిస్తుందన్నారు.

కమిషన్ ఏర్పాటుతో రాష్ట్ర గిరిజన సంక్షేమంలో సువర్ణాధ్యాయం మొదలవుతుందని అభిప్రాయపడ్డారు. సతమ మేలు కోసం తమకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దడం కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్రంలో గిరిజనులందరూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.

గిరిజనులకు ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి వారి సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో గిరిజనులు సామాజికంగా ఎదగడానికి కూడా పునాదులు వేసారని ప్రశంసించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది నిజమని పెద్దిరెడ్డి నిరూపిస్తే నడిరోడ్డుపై తలనరుక్కుంటా, జడ్జి రామకృష్ణ