Publish Date: Fri, 19 Nov 2021 (14:36 IST)
Updated Date: Fri, 19 Nov 2021 (14:39 IST)
నిత్యాన్నదాత, ఆధ్యాత్మిక శిఖరం, సూఫీ సద్గురువు బాబా ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా ఖాదరీ
(85) శుక్రవారం ఉదయం అస్తమించారు. బాబా వారికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. వారి సహధర్మచారిణి ఇటీవలనే జులైలో పరమపదించారు. బాబా వారి పవిత్ర పార్థివ శరీరాన్ని భక్తుల దర్శనార్థం దర్బారు ప్రాంగణంలో ఉంచారు. దేశ వ్యాప్తంగా ఉన్న వారి భక్తుల కోరిక మేరకు బాబె బొగ్దాద్ సూఫీ స్థలిలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు అంతిమ సంస్కారం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
కృష్ణా జిల్లా చీమలపాడులో సూఫీ మహనీయులు, నిరతన్నదాత, బాబే ఎ బొగ్దాద్, ఏ ఏ ఎం టి కె పీఠాధిపతి ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా ఏళ్ళుగా మతపెద్దగా ఉన్నారు. అంతేకాదు, ఏళ్ళతరబడి నిత్యం ఆయన అన్నదానం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా అన్నదాతగా పేరుపొందారు. గత ఒకటి రెండు మాసాలుగా అస్వస్థులుగా ఉన్న బాబా దాదాపుగా నెల రోజుల నుంచి ఔషధాలు, అన్నపానీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. బాబా అస్తమయం వార్త విని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు, పరిసర ప్రాంతాలకు చెందిన సాధారణ ప్రజానీకం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.