జీపు నడపాలనుకున్న ఓ వ్యక్తి సరదా... ముగ్గురు దుర్మరణం.. 14 మందికి గాయాలు
జీపు నడపాలనుకున్న ఓ వ్యక్తి సరదా ముగ్గురి మరణానికి దారితీయడమేకాకుండా, 14 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనలో జీపు నడుపుతున్న వ్యక్తితోపాటు ఇద్దరు దంపతులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
జీపు నడపాలనుకున్న ఓ వ్యక్తి సరదా ముగ్గురి మరణానికి దారితీయడమేకాకుండా, 14 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనలో జీపు నడుపుతున్న వ్యక్తితోపాటు ఇద్దరు దంపతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో ఏడుగురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. విశాఖపట్టణం జిల్లా జి.మాడుగుల మండలం వంజరి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే... గెమ్మెలి గ్రామానికి చెందిన గుల్లెల కేశవరావు, గుల్లెల చిన్నబ్బాయి కుటుంబాల వారు, పాడేరు మండలం మినుములూరులో వివాహ సంబంధం గురించి మాట్లాడేందుకు వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తికి చెందిన జీపును మాట్లాడుకున్నారు. మొత్తం 17 మంది కలిసి మినుములూరు పయనమ్యారు. అయితే గుల్లెల కేశవరావుకు సొంత జీపు ఉండటంతో పాటు డ్రైవింగ్ కూడా వచ్చు. తాను జీపు నడుపుతానని కేశవరావు చెప్పడంతో, కృష్ణ పక్కకు తప్పుకుని, స్టీరింగ్ కేశవరావుకు ఇచ్చాడు.
గెమ్మెలి దాటిన తర్వాత వంజరి ఘాట్ దిగుతున్న సమయంలో వేగంగా వెళుతున్న జీపును కేశవరావు అదుపు చేయలేక, రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొనడంతో కేశవరావుతో పాటు, దంపతులు చిన్నబ్బాయి, వరహాలమ్మ అక్కడిక్కడే మృతి చెందారు. జీపులో ఉన్న మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కేశవరావు భార్య మచ్చమ్మ కూడా వుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.