Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమండ్రి అభివృద్ధిలో కేంద్ర నిధులు రూ. 200కోట్లు

రాజమండ్రి అభివృద్ధిలో కేంద్ర నిధులు రూ. 200కోట్లు
విజ‌య‌వాడ‌ , గురువారం, 7 అక్టోబరు 2021 (09:40 IST)
రాజమండ్రి అభివృద్ధి- కేంద్ర నిధులు అనే అంశంపై భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో సమావేశ‌మయ్యింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జ్ కురగంటి సతీష్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపిశ్రీనివాస్ లు మాట్లాడుతూ, రాజమండ్రి అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే అన్నారు. రాజమండ్రి అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు గానీ, రాజమండ్రి ప్రజానీకానికి మొహం చూపించే అర్హత గానీ కేవలం బీజేపీకి మాత్రమే ఉంది అని అన్నారు. రాజమండ్రి అభివృద్ధిని మోదీ ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించింద‌ని, అందులో భాగంగా ఈ రోజు రాజమండ్రిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. 
 
ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఈ అభివృద్ధి అంతా తమదే అంటూ స్టిక్కర్లు రంగులు వేసుకుని తిరుగుతున్నార‌ని ఆరోపించారు. ప్రచార యావ, అవినీతి మైకంతో వ్యవస్థలను బ్రష్టుపట్టిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్తంగా పరిపాలన చేస్తోంద‌ని, నిజాలు మాట్లాడటానికి వారు భయపడుతున్నార‌ని విమ‌ర్శించారు. అబద్దాలతో కాలం వెళ్లబుచ్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారు అని విమర్శించారు. కానీ రాజమండ్రి అభివృద్ధిపై మాట్లాడటానికి బీజేపీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది అని చెప్పారు.
 
రాజమండ్రి నగరాన్ని సుందరీకరించడం, నాణ్యమైన రోడ్లు వేయడమే కాకుండా బ్రిటీష్ కాలం నాటి త్రాగునీటి పైపుల స్థానంలో అమృత్ పధకంలో పైపులు వేశార‌ని చెప్పారు. రాజమండ్రి ప్రజానీకం ఆరోగ్యం కాపాడటం అనే అంశంపై మోదీ ప్రభుత్వం పనిచేస్తుంద‌ని, ఇప్పటి వరకు నిర్మాణం అయిన, నిర్మాణం అవుతున్న డ్రైనేజీ పనులు గాని, చిన్నపాటి వర్షంకు కూడా మునిగిపోతున్న ప్రాంతాలలో కాంక్రీట్ పనులు అన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా దేవిచౌక్, ఆనాల వెంకటప్పారావు రోడ్డు, ఏకేసి కాలేజి రోడ్డు, శ్యామల సెంటర్,  జైల్ రోడ్డు తదితర ప్రధాన కూడళ్లలో సుందరీకరణ , రోడ్ల పనులన్నీ కేంద్ర నిధులతో జరుగుతున్నాయ‌ని చెప్పారు. అలాగే గోదావరి కాలుష్యం నివారించ‌డానికి గోదావరి మిషన్ కి నిధులిస్తున్నార‌ని, అధునాతన సౌకర్యాలతో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నిర్మాణం విస్తరణ జరిపార‌ని తెలిపారు. 
 
గతంలో ఈ ఎయిర్పోర్ట్ ఆర్టీసీ బస్టాండ్ ని తలపించేదని, అలాగే కొవ్వూరు నుండి గుండుకొలను వరకు 1800 కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేసామ‌ని తెలిపారు. నేషనల్ హైవే ఆరు లైన్లుగా మారుస్తూ మోరంపూడి ఫ్లై ఓవర్ కి నిధులిచ్చార‌ని, రాజమండ్రి పరిసర గ్రామాలను హైవేకు కలుపుతూ రోడ్లు వేస్తున్నార‌ని, రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి కి వంద కోట్లు అందంచార‌ని తెలిపారు. 
 
రైల్వే స్టేషన్ విస్తరణ చేపట్టామ‌ని, యువత హరిత పేరుతో మొక్కలు నాటి పెంచే కార్యక్రమ నిధులన్నీ కేంద్రమే అందిస్తుంద‌ని వివ‌రించారు. అలాగే రాజమండ్రి నగరంలో తడి చెత్త పొడి చెత్త వాహనాలు గానీ , కంపోస్టు యార్డుల నిర్మాణం గానీ, అధునాతన చెత్తకుండీల ఏర్పాటుకు, నీలం పచ్చ చెత్త డబ్బాల ఏర్పాటుకు గానీ నిధులు అన్నీ మోదీ ప్రభుత్వమే అందిస్తుంద‌ని తెలిపారు. అలాగే రాజమండ్రి నగరంలో 152 అభివృద్ధి పనులకు కేంద్రం నిధులందించిందని ఈ అభివృద్ధి అంతా నేనే చేస్తున్నాను, మా ముఖ్యమంత్రి చేస్తున్నాడు అని స్టిక్కర్లు రంగులు వేసుకుని తిరుగుతున్న ఎంపీ భరత్ రామ్ గానీ వైసీపీ నాయకులు గానీ రాజమండ్రి నగర అభివృద్ధికి ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. 
 
14వ ఆర్ధిక సంఘం నుండి 120కోట్లు , 15 వ ఆర్ధిక సంఘం నుండి ఇప్పటి వరకు 26కోట్లు, ఎంపీ నిధులకు 70లక్షలు , అమృత్ పధకం ద్వారా సుమారు 14కోట్లు , జలశక్తి నిధులు ఇలా ఇప్పటి వరకు రాజమండ్రి అభివృద్ధికి సుమారు 200 కోట్లకు పైగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అందించింది అని లెక్కలు చెప్పారు. ఇంకా ఎన్నో ప్రతిపాదనలకు నిధులు మంజూరుకి సిద్ధంగా ఉంది. ఇంతే కాకుండా పార్లమెంట్ లో ప్రతి మండలంకు గ్రామాల వారీ జనాభా ఆధారంగా కేంద్రం నేరుగా ఆ పంచాయతీలకు నిధులు అందిస్తుంది. రాజమండ్రి నగరంలో గానీ ప్రతి గ్రామంలో కూడా ప్రతి అభివృద్ధిలో భారత ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే ఉన్నారని తెలియజేస్తున్నాము. రాజమండ్రి అభివృద్ధి పై బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, కేంద్ర నిధులు అభివృద్ధి పనులకు రంగులు స్టిక్కర్లు మాని ప్రజల ముందుకు వెళ్లాలని వైసీపీ నాయకులకు హితవు పలుకారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలెపు సత్యసాయిరాం , ప్రధాన కార్యదర్శి మన్నెం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పిల్లాడి రుద్రయ్య , నందివాడ సత్యనారాయణ , మీడియా కన్వీనర్ వీవీ అంజేనేయులు,రూరల్ అధ్యక్షులు యానాపు ఏసు , ధనాల రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు ఎన్.ఐ.ఏకు అప్పగింత