Publish Date: Mon, 13 Jul 2020 (10:57 IST)
Updated Date: Mon, 13 Jul 2020 (10:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ చల్లబడింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు చెప్పారు.
బంగాళాఖాతంపై కేంద్రీకృతమైన అల్పపీడనం.. క్రమంగా వాయువ్యదిశగా పయనిస్తుంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం జార్ఖండ్, ఉత్తర ఒడిశాను అనుకుని కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా రెండు రోజులకు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు విరివిగా పడడంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.