Publish Date: Fri, 10 Jul 2020 (22:20 IST)
Updated Date: Fri, 10 Jul 2020 (22:21 IST)
ఆయన వైసిపి ఎంపి. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి ఎంపిగా గెలుపొందాడు. కానీ తనకున్న చరిష్మాతోనే గెలుపొందినట్లు చెబుతాడు. ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల్లో తేడా వస్తే ఊరుకోడు. అధినేతను, మంత్రులందరినీ ఏకిపారేస్తాడు. కానీ ఆ తరువాత తాను పార్టీలో ఉన్నానని.. అనవసరంగా కొంతమంది తనపై బురదజల్లుతున్నారని చెబుతుంటాడు.
ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన ఎవరో.. రఘురామక్రిష్ణమరాజు వ్యవహారం రోజు రోజుకు ముదిరి పాకానపడుతోంది. ఆయన మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎంపిలు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి లోక్ సభ స్పీకర్కి ఫిర్యాదు చేశారు. అయినా కూడా రఘురామక్రిష్ణమరాజు మాత్రం తగ్గడం లేదు.
తనకు అధినేత అంటే చాలా ఇష్టమని..ఆయన్ను ప్రేమిస్తున్నానని చెబుతుంటాడు. తాజాగా వైసిపి ఎమ్మెల్యేలు భీమవరం, పోడూరు పోలీస్టేషన్ లలో ఎంపిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపి కూడా హైకోర్టును ఆశ్రయించారు. తనపై చేసిన ఫిర్యాదులు, కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు.
ఇప్పట్లో రఘురామక్రిష్ణరాజు వ్యవహారం సద్దుమణిగే అవకాశమే లేదంటున్నారు వైసిపి నేతలు. పార్టీని వదిలి వెళ్ళకుండా.. ఆ పార్టీలోనే ఉంటూ విమర్సలు చేస్తూ తనపై విమర్సలు చేస్తున్న వారిని ఏకిపారేస్తున్న రఘురామక్రిష్ణమరాజు వ్యవహారం కాస్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.