Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఏకాంతంగా ఆర్ఆర్ఆర్ చర్చలు!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఏకాంతంగా ఆర్ఆర్ఆర్ చర్చలు!
, గురువారం, 3 జూన్ 2021 (08:47 IST)
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం రాత్రి అర్థగంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో తనపై ఏపీ సీఐడీ పోలీసులు, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, గుంటూరు ప్రభుత్వ జీహెచ్ సూపరింటెండెంట్, సైనిక ఆస్పత్రి డైరెక్టర్ నడుచుకున్న తీరును పూసగుచ్చినట్టు వివరించారు. అంతేకాకుండా, తనపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయడానికి గల కారణాలను ఆయన స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. 
 
ఏపీ సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని జీర్ణించుకోలేక కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని స్పీకర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 
 
తన కేసులో ముఖ్యమంత్రి జగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, ఏఎస్‌పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని, తనను తీవ్రంగా గాయపరిచారని స్పీకర్‌కు తెలిపారు. 
 
తాను సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని, తన అరెస్టుకు ముందు స్పీకర్‌గా మీకు సమాచారం కూడా ఇవ్వలేదని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.
 
తనను అక్రమంగా అరెస్ట్ చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అయిన గాయాలపై గుంటూరు ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చిన అసత్యాల నివేదికపై హైకోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు, సీఐడీ కోర్టు బేఖాతరు చేశాయన్నారు. 
 
వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా జారీ అయినట్టు గుర్తు చేశారు. రఘురామ కృష్ణరాజు చెప్పినవన్నీ విన్న స్పీకర్ ఓం బిర్లా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తనపై జరిగిన దాడిపై మాట్లాడేందుకు అనుమతివ్వాలని కోరగా, స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు..