Publish Date: Sun, 17 Mar 2019 (13:23 IST)
Updated Date: Sun, 17 Mar 2019 (14:56 IST)
వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అన్నంత పని చేశాడు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యకు పాల్పడతానంటూ ప్రకటించారు. ఆదివారం వైకాపా చీఫ్ జగన్ విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన అన్నంత పని చేశాడు.
గత రాత్రి నిద్రమాత్రలు మింగిన ఆయన, ఆపై తన చేతిపై కత్తితో కోసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సునీల్ను హుటాహుటిన పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే అత్యవసర చికిత్స నిర్వహించిన వైద్యులు, ఆయన ఆరోగ్యంగా నిలకడగా ఉందని, ప్రమాదం తప్పినట్టేనని వెల్లడించారు.
కాగా, గత వారంలో మూడు రోజుల పాటు తన కుటుంబీకులతో కలిసి లోటస్ పాండ్ లోని జగన్ నివాసం వద్ద వేచి చూసిన సునీల్, ఆయన్ను కలవకుండానే వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆపై తనకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఆదివారం వెల్లడించిన జాబితాలో ఆయన పేరు లేదు.