Publish Date: Tue, 23 Feb 2021 (14:12 IST)
Updated Date: Tue, 23 Feb 2021 (14:13 IST)
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ మేరకు జిల్లాల యంత్రాంగానికీ ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతేకాకుండా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
అయితే దీనికి సంబంధించిన అంశాలు కోర్టు పరిధిలో ఉన్నట్లు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో పురపాలక ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించినందుకు ఎస్ఈసీ అభినందించారన్నారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న పోలీసులకు కరోనా సోకినట్లు ఎలాంటి నివేదికలు లేవని చెప్పారు. అవసరమైతే సిబ్బందికి వ్యాక్సిన్ వేయిస్తామన్నారు.