తాను మానసికంగా చనిపోయానని, తన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తన కుటుంబాన్ని నిరంతరం వేధిస్తోందని ఆయన ఆరోపించారు. పైగా, తాను నమ్మిన వ్యక్తే తనను మోసం చేశారని అన్నారు. ఆయన కృష్ణా జిల్లాలో జరిగిన వైకాపా కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిననాటి నుంచి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైకాపా కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేయించారని ఆరోపించారు. తనపై రేషన్ బియ్యం అక్రమ రవాణా పేరుతో తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రేషన్ బియ్యం కేసుకు సంబంధించి ఆయన వివరణ ఇస్తూ, "నేను, నా అత్త మామలు కలిసి అద్దెకు ఇవ్వడానికి ఆ గోదాములు కట్టాం. నేను నమ్మిన వ్యక్తిని అక్కడ పెడితే... ప్రభుత్వ ఉద్యోగులు, అతను కలిసి తప్పు చేశారు. గోదాములు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బస్తాలు తరలింపులో తేడా వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. తేడా వచ్చిన ఆ సొమ్ము కడతామని చెప్పాం. దీంతో జాయింట్ కలెక్టర్ లెటర్ రాసుకున్నారు. లెటర్ పైకి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలైంది" అని తెలిపారు.
గోదాములో బియ్యం కొరత ఉంటుందని, ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ చెప్పారని, రూ.కోటి 80 లక్షలు కట్టాలని చెబితే, కోటి రూపాయలు అదే రోజు కట్టామని, మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పినా, అనూహ్యంగా అదే రోజు క్రిమినల్ కేసు పెట్టారని ఆయన వివరించారు. ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిందనే కారణంగానే కేసు పెట్టారని ఆరోపించారు. "22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుకున్నామని సీజ్ ద గోడౌన్' అన్నారు. కోర్టుకు వెళితే ఫైన్ కట్టించుకుని వదిలేయమని చెప్పింది" అని గుర్తు చేసుకున్నారు.
"పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కేసులు లేవు... ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పని చేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మానసికంగా ఆరోజే చచ్చిపోయా" అంటూ పేర్ని నాని భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. తన భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, "మీ టైం నడుస్తోంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది అనుకున్నా" అని అన్నారు. తన భార్యకు బెయిల్ వచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరిందని, అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయాల్లో తిరిగే వాళ్ల భార్యల పేరుతో వ్యాపారాలు పెట్టొద్దని ఆయన సూచించారు. నా భార్యని తీసుకొని రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నా అని ఆవేదన వ్యక్తం చేశారు.