Publish Date: Mon, 27 Sep 2021 (21:09 IST)
Updated Date: Mon, 27 Sep 2021 (21:13 IST)
ఏపీలో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రుద్దుతోందని జనసేన అధినేత పవన్కల్యాణ్ విమర్శించారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదని.. సంక్షేమం అసలే కాదన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. 'నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు' అని ఆయన ఎద్దేవా చేశారు.
వైకాపా ప్రభుత్వం చేసిన వాగ్దానాలు.. వాటిని అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట #SaveAPfromYSRCP హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ పోస్ట్ చేశారు. వైకాపా ఇచ్చిన హామీలు.. ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరిస్తూ పవన్ ట్వీట్ చేశారు.
''రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తానన్న ప్రభుత్వం.. మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని భద్రతగా పెట్టి రుణాలు పొందుతోంది. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సర్కారు.. ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ట్రూఅప్ పేరుతో ఛార్జీలు పెంచారు. ప్రజలకు భద్రత, రక్షణ కరువైంది.. నేరాల రేటు 63 శాతం పెరిగింది'' అంటూ పవన్ తన ట్వీట్లో పలు విషయాలను ప్రస్తావించారు.