Publish Date: Fri, 11 Nov 2022 (22:32 IST)
Updated Date: Fri, 11 Nov 2022 (22:33 IST)
విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. విశాఖలోని ఐఎన్ఎస్ చోళాలో వీరిద్దరి భేటీ అరగంటకుపైగా సాగింది. ఈ భేటీలో జనసేన పార్టీకి చెందిన మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు.
ఈ భేటీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోడీని ఎనిమిదేళ్ల తర్వాత కలిసినట్టు గుర్తుచేశారు. అదీ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో కలిశానని వెల్లడించారు. ఈ భేటీలో ప్రధాని మోడీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ముఖ్యంగా, తెలుగు ప్రజలంతా బాగుండాలని, తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలని అభిలషించారని చెప్పారు. అదేసమయంలో తనకు అవగాహన ఉన్నంత మేరకు ప్రధాని అడిగిన ప్రశ్నలకు విషయాలు తెలియజేశానని చెప్పారు. ఏపీకి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని, ఆ దిశగా ఈ భేటీ ఫలప్రదమైనట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు.
అయితే, ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో విశాఖ ఘటనతో పాటు ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు కూల్చివేత ఘటనలతో పాటు మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి అంశాలపై ఐదు పేజీల బ్రీఫ్ నోట్ను ప్రధాని మోడీకి అందజేశారు. దీన్ని నిశితంగా ప్రధాని మోడీ పరిశీలించారు.
అలాగే, ఏపీకి చెందిన పలువురు బీజేపీ నేతల వ్యవహారశైలిని కూడా ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కాగా, బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశానికి ముందే పవన్ కళ్యాణ్తో నరేంద్ర మోడీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.