Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతిపక్షానికి కోరస్‌లా పవన్ కళ్యాణ్: మంత్రి బొత్స

ప్రతిపక్షానికి కోరస్‌లా పవన్ కళ్యాణ్: మంత్రి బొత్స
, మంగళవారం, 26 నవంబరు 2019 (13:38 IST)
ఐదేళ్లలో అమరావతిని అభివృద్ధి చేయని ప్రతిపక్షనేత రాజధాని పర్యటనకు ఎలా వస్తారని రాష్ట్ర పురపాలక శాఖ‌ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్  లక్షా 9 వేల కోట్లు అయితే అందులో రాజధానికి ఖర్చుచేసింది కేవలం 4 శాతం అంటే రూ.4900 కోట్లు మాత్రమేనని మంత్రి తెలిపారు.
 
ప్రతి ఏడాదికి ఒక శాతం చొప్పున నాలుగేళ్లలో నాలుగు శాతం మాత్రమే రాజధానికి ఖర్చు చేసి గొప్పలు చెప్పుకుంటూ తిరగడం ప్రతిపక్షనేతకే చెల్లిందని బొత్స అన్నారు. గడిచిన ఐదేళ్లలో అమరావతిలో కేవలం నాలుగు భవనాలు కట్టి వాటి ఖర్చు రూ.4900 కోట్లు చూపి ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుని మీరు చేసిన అభివృద్ధి ఇదేనా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు.  
 
కట్టిన నాలుగు భవనాలు కూడా 70 నుంచి 90 శాతం మాత్రమే పూర్తిచేశారని గుర్తుచేశారు. రాజధానిలో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. అభివృద్ధి చేయని ప్రతిపక్ష నేతను రైతులే నిలదీసి ప్రశ్నించాలని సూచించారు. చంద్రబాబు రాజధానికి వచ్చి రైతులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 
 
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూ.32 వేల కోట్ల టెండర్లు ఏ ఉద్దేశంతో పిలిచారన్నారు. భూములిచ్చిన రైతుల ప్రగతి కోసం ఒక్కసారైనా ప్రతిపక్ష నేత ఆలోచించారా అని సందేహం వ్యక్తం చేశారు. రైతులు ఇచ్చిన భూముల్లో కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి అందిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో 55 శాతంకు పైగా పనులు జరిగి ఆగిపోయిన భవనాలను తమ ప్రభుత్వం పూర్తిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 
 
రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల భూములను అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని శ్మశానాలను చూసేందుకు వస్తున్నామని ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. రైతులను అమాయకులను చేసి అనవసరంగా రాజధానిలో ప్రతిపక్ష నేత గందరగోళం, అశాంతిని సృష్టించి పబ్బం గడుపుకోవాలని మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న చంద్రబాబును చరిత్ర కూడా క్షమించదని మంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఇటీవల విడుదల చేసిన సర్వేఆఫ్ ఇండియా చిత్రపటంలో పెట్టించిన ఘనతగా టీడీపీ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కనీసం ఐదేళ్లలో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇప్పించుకోలేని స్థితిలో ప్రతిపక్ష నేత పరిపాలన సాగించారని ఎద్దేవా చేశారు. 
 
గతంలో రైతులకు రూ.2000 కోట్ల సబ్సిడీ ఎగ్గొట్టి రైతుల పక్షాన ఉన్నామని చెప్పుకుంటే ఎలా అని ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. ప్రజలెప్పుడూ అమాయకులు కారని, ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా మీ ఐదేళ్ల మోసానికి ఇచ్చిన ప్రతిఫలమే ప్రతిపక్షనేతగా మారడానికి కారణమయ్యిందన్నారు. 2015 అక్టోబరులో ప్రధానమంత్రిని రాజధాని నిర్మాణానికి పిలిచి చేసిన శంకుస్థాపనలు ప్రతిపక్ష నేతకు శ్మశానాల్లా కనబడుతున్నాయని ప్రశ్నించారు. 
ప్రజలను మోసం చేసి మా ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేయాలని ప్రతిపక్ష నేత ఆలోచన చేస్తున్నారన్నారు. ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్షనేత దిశానిర్ధేశాలు మా ప్రభుత్వానికి అక్కర్లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి, పారదర్శకపాలన ఎలా చేయాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అన్నారు. 
 
హ్యాపీనెస్ట్ అభివృద్ధి విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తికాగానే రెండేళ్లలో హ్యాపీనెస్ట్‌ను పూర్తి చేసి అందులో ప్లాట్లు కొన్నవాళ్లకు కట్టించి ఇస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని విషయంలో జీఎన్ రావు, రవీంద్రనాథ్‌ల నిపుణుల కమిటీ వేయడం జరిగిందని వారు 13 జిల్లాల్లో పర్యటించి విధివిధానాలు తయారుచేసి ప్రతిపాదనలతో కూడిన సంబంధిత నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేస్తారన్నారు. దానిపై మంత్రి వర్గం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. 
 
ఆరు వారాల్లో ఈ నిపుణుల కమిటీ నివేదికను ముఖ్యమంత్రికి అందజేయాలని కోరగా వారు మరికొంత సమయాన్ని కోరినట్లు పేర్కొన్నారు. అయితే త్వరితగతిన 13 జిల్లాలతో పాటు రాజధానికి సంబంధించిన అభివృద్ధిపై నివేదికను పూర్తిచేయాలని సీఎం ఇప్పటికే స్పష్టం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు 6 నెలల కాలంలో అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ కాలంలో హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఇదే ఆరు నెలల్లో కనీసం ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. ఒకవేళ ఉంటే తాను తలదించుకుంటానని మంత్రి సవాల్ విసిరారు. 
 
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహజంగానే పరిపాలన పరంగా సమయాభావం, ఒడిదుడుకులు వస్తుంటాయని వాటిని అధిగమించి ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అన్నారు. ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలను అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకూ ప్రతిపక్ష నేత ప్రతి అంశంపై రాద్దాంతం చేస్తుంటే ఆయనకు కోరస్‌గా పవన్ కళ్యాణ్ మారరని మంత్రి బొత్స విమర్శించారు. 
 
గడిచిన 5 నెలల కాలంలో ప్రభుత్వం రైతుభరోసా, ఆంగ్లమాధ్యమం సంక్షేమ పథకాలతో పాటు  నూతన ఇసుక విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. పేదప్రజల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహా  ఆంగ్లవిద్యను అందిస్తామన్నారు.  ఇవి చూసి ఓర్వని కొందరు దుష్ప్రచారాలు చేస్తూ తమ సొంత మాద్యమాలతో ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాయిస్తూ కాలక్షేపం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై మన్ కీ బాత్ లో దేశప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు ప్రస్తావిస్తూ వక్రీకరించారని గుర్తుచేశారు. 
 
ఆంగ్లంతో పాటు తెలుగు భాషను కూడా తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తామన్నదే తప్ప ఎక్కడా మాతృభాషను విస్మరిస్తామని చెప్పలేదన్నారు. మాతృభాష మనుగడ కోసమే తెలుగుభాషా అధికార సంఘం ఏర్పాటు చేయడంతో పాటు తెలుగును తప్పనిసరి చేశామన్న విషయం తెలుసుకోవాలన్నారు. గతంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ఏర్పాటు చేసినప్పుడు కూడా విమర్శలు వచ్చాయన్న విషయం ప్రస్తావిస్తూ ఆ పథకం గొప్పతనం తెలిశాక దేశం మొత్తం ఆదర్శంగా తీసుకున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
 
ఏప్రిల్ తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తామని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా మార్కెట్ యార్డు కమిటీలలో 50 శాతం రిజర్వేషన్ విధానాన్ని తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు అవకాశం ఇస్తున్నామన్నారు. రాబోయే ఏ ప్రభుత్వాలైనా మేము తెచ్చిన ఈ విధానాన్ని తీసేసే దమ్ముంటే తలదించుకుంటానని సవాల్ విసిరారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సమసమాజ నిర్మాణం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. 
 
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకూ రూ.2 లక్షల 55వేల కోట్లు గత ప్రభుత్వాలు అప్పును చేసి ప్రజలపై భారాన్ని మోపాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత కోర్టు సమస్యలను పరిష్కరించుకొని నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలుచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపడతామన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని పరిధిలో నిర్మాణాలు కొనసాగించండి : సీఎం జగన్ ఆదేశం