Publish Date: Sat, 02 Oct 2021 (10:04 IST)
Updated Date: Sat, 02 Oct 2021 (10:05 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో సంకల్పించిన శ్రమదానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలోని రహదారులు దుస్థితిపై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమానికి పిలుపిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి పవన్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు.
కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. శ్రమదానం అనంతరం నిర్వహించే సభకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు.
మరోవైపు పవన్ పర్యటన దృష్ట్యా అధికారులు ఈ మార్గంలో గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసేశారు. రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు.
రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసుల ముందస్తు నోటీసులు జారీ చేశారు. పవన్ ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోనూ పర్యటించే అవకాశం ఉంది.