Publish Date: Thu, 16 Jul 2020 (06:26 IST)
Updated Date: Thu, 16 Jul 2020 (06:29 IST)
సమాచార హక్కు చట్టం-2005కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్కు ముఖ్య సమాచార కమీషనర్గా ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.రమేశ్కుమార్, సమాచార కమీషనర్గా నియమితులైన రేపాల శ్రీనివాసరావులచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రమాణం చేయించారు.
ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం మొదటి భవనంలోని సిఎస్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో వారితో సిఎస్ ప్రమాణం చేయించారు. రాష్ట్ర సమాచార కమీషన్కు ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది సమాచార కమీషనర్లను నియమించగా ఖాళీగా ఉన్న ముఖ్య సమాచార కమీషనర్ మరియు సమాచార కమీషనర్లను ప్రభుత్వం ఇటీవల నియమించడం జరిగింది.
ఈ విధంగా నియమించబడిన చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా పి.రమేశ్ కుమార్,సమాచార కమీషనర్ గా రేపాల శ్రీనివాస రావు లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రమాణ చేయించారు.
కరోనా నేపధ్యంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (జిపిఎం&ఎఆర్) శశిభూషణ్ కుమార్, రాష్ట్ర సమాచార కమీషన్కు చెందిన ఇతర కమీషనర్లు యం.రవికుమార్, బి.వి.రమణకుమార్, కట్టా జనార్ధన్, ఐలాపురం రాజా, నూతన చీఫ్ కమీషనర్, కమీషనర్లుగా ప్రమాణం చేసిన వారి కుటుంబ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.