Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం.. మంత్రి బొత్స సత్యనారాయణ

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం.. మంత్రి బొత్స సత్యనారాయణ
, బుధవారం, 24 జులై 2019 (18:24 IST)
తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని, రాప్ష్ట్రంలోని రైతులందరి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఉన్నామని అసెంబ్లీలో పలువురు మంత్రులు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో – రైతులకు సాగు పెట్టుబడి అంశంపై టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్న వేశారు. రైతులకు ఇస్తామన్న రూ.12,500 ఇవ్వటమే కాకుండా కౌలు రైతులకు విధివిధానాలు ఖరారు చేయాలని దీనిపై స్పష్టత ఇవ్వాలని మంత్రి కోరారు. 
 
తొలుత ఈ ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం ఇస్తూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోని చూపిస్తూ.. ఇది మాకు భగవద్గీత, ఖురాన్, బైబుల్‌ అని అన్నారు. 
 
పంట వేసే సమయానికి ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500లు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచామని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రణాళిక ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రభుత్వం స్వర్గీయ డాక్టర్‌ వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో వచ్చిందని అన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతు పెట్టేవాడిగా ఉండాలి తప్ప చేయి పట్టేవాడిగా ఉండకూడదన్నది ఆయన ఆశయమని.. అలాంటి వైయస్‌ఆర్‌ ఆశయంతో వచ్చిన ప్రభుత్వం తమదన్నారు. 
 
వచ్చే ఏడాది మే నెలలో ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయాన్ని ముందుగానే ఈ అక్టోబర్‌ 15 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. 
 
గత ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత జనవరిలో రూ.1,000లు, ఫిబ్రవరిలో రూ.2,000 ఇచ్చారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. మేము అలా కాకుండా సున్నా వడ్డీకే రైతులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. గతంలో సున్నా వడ్డీ రుణాలను నిర్వీర్యం చేశారన్నారు. అయితే ప్రివిలేజ్‌ మోషన్‌ తీసుకువచ్చి టీడీపీ సభ్యులు భంగపడ్డారని బొత్స తెలిపారు. 
 
ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని రైతుకు మేలు చేయటానికే ఈ ప్రభుత్వం ఉందని బొత్స అన్నారు. కౌలు రైతుల గురించి ఏనాడైనా టీడీపీ ఆలోచించిందా? టీడీపీ నేతలు ఎప్పుడైనా కౌలు రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించారా? అని బొత్స ప్రశ్నించారు. కౌలు రైతుల మేలు కోసం, భూ యజమానులకు ఇబ్బంది లేకుండా..  ప్రభుత్వం 11 నెలల డాక్యుమెంట్‌ తయారు చేయటం జరిగింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా, సున్నా వడ్డీకే రుణాలు, పంటల బీమా వంటివి అందజేయటానికి ప్రణాళిక రూపొందించామని బొత్స సత్యనారాయణ తెలిపారు. 
 
విత్తనాల సమస్యపై స్పందిస్తూ..ఖరీఫ్‌ పంట అంటే జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఇండెంట్‌ ఇచ్చి చేస్తారు. మరి, జనవరి నుంచి మార్చి వరకు అధికారంలో ఉన్నది ఎవరని ప్రశ్నించారు. గత ప్రభుత్వం విత్తన కంపెనీలకు బకాయిలు కూడా చెల్లించలేదని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. రైతుతో పాటు కౌలు రైతులకు కూడా రూ.12,500 పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని దీనివల్ల కౌలు రైతులతో సహా 64 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారని బొత్స సత్యనారాయణ తెలిపారు. 
 
గత ప్రభుత్వం 46 లక్షల మంది రైతులకు మాత్రమే వెయ్యి, రెండు వేలు ఇచ్చారు. మిగిలిన వారు ఏమయ్యారని ఈ సందర్భంగా బొత్స ప్రశ్నించారు. రైతుకు, కౌలు రైతు సమానంగా పెట్టుబడి సాయం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయించారని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయండి... హైకోర్టులో యువజన కాంగ్రెస్ పిల్