Publish Date: Mon, 08 Feb 2021 (12:34 IST)
Updated Date: Mon, 08 Feb 2021 (12:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన కంటికి స్వల్ప ఇన్ఫెక్షన్ అయింది. దీంతో ఆయన చేపట్టిన పర్యటనలను తాత్కాలికంగా వాయిదావేసుకున్నారు.
ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆయన ఐ టెస్ట్ చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో సోమవారం కడప జిల్లా పర్యటనను ఆయన వాయిదా వేసుకున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మంగళవారం జరగనుంది.
ఈ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని ప్రభుత్వం తెగేసి చెప్పింది.
ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు నిమ్మగడ్డ అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
మరోవైపు ఏకగ్రీవాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఏకగ్రీవాలు జరిగితే ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఏకగ్రీవాలు బలవంతంగా జరగకుండా చూడాలని నిమ్మగడ్డ అధికారులకు సూచిస్తున్నారు.