Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రవీణ్ ప్రకాష్‌ను తొలగించకుంటే కోర్టు ధిక్కరణే : నిమ్మగడ్డ హెచ్చరిక

ప్రవీణ్ ప్రకాష్‌ను తొలగించకుంటే కోర్టు ధిక్కరణే : నిమ్మగడ్డ హెచ్చరిక
, శనివారం, 30 జనవరి 2021 (18:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోమారు ఏపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ను తొలగించాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే తాను జారీచేసిన ఆదేశాలు అమలుకాకపోవడంపై ఆయన మండిపడ్డారు. 
 
ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదనే కారణంతో విధుల నుంచి తొలగించాలని సీఎస్‌కు సూచిస్తూ గతంలో లేఖ రాశారు. అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. 
 
ఈ వ్యవహారంలో తన ఆదేశాలు అమలు కాకపోవడంతో సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ మరోసారి లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో ఉన్న అధికారి ఆదేశాలు అమలు చేయకపోవడం చట్టవిరుద్ధమన్నారు. తన ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తన ఆదేశాలు అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ అవుతుందని వెల్లడించారు. 
 
మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను కోరారు. ఈ మేరకు సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మంత్రులు కోడ్‌ను ఉల్లంఘించకూడదని సూచించారు. 
 
అంతేకాకుండా వారి పర్యటనల్లో అధికారులు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే పార్టీ కార్యాలయాలకు వెళ్లే సమయంలో, అభ్యర్థుల తరపున ప్రచారం చేసేటప్పుడు ప్రభుత్వ వాహనాలను వాడవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే  ప్రతి పర్యటన ఎన్నికల ప్రచారంగానే భావించాల్సి వస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
 
కాగా, ఏపీ మంత్రులకు, నిమ్మగడ్డకు మధ్య ఏమాత్రం పొసగని విషయం తెల్సిందే. దీంతో నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కులం పోరుతో దూషిస్తున్నారు. నిమ్మగడ్డకు పిచ్చిపట్టిందంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిలు ఆరోపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ హింసలో వంది రైతులు గల్లంతు... ఆరా తీస్తున్న కేంద్రం