Publish Date: Mon, 13 Sep 2021 (10:50 IST)
Updated Date: Mon, 13 Sep 2021 (10:53 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త ఆత్మహత్యల ప్రదేశ్గా మారిపోయిందని ఆరోపించారు.
ఫ్యాన్కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన యువత ఇప్పుడు అదే ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందన్నారు. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరమన్నారు.
అందువల్ల వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాడి ఉద్యోగాలు సాధిద్దాం అంటూ పిలుపునిచ్చారు.