Publish Date: Sun, 01 Mar 2026 (09:42 IST)
Updated Date: Sun, 01 Mar 2026 (09:37 IST)
శ్రీవారి భక్తలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఓ హెచ్చరిక చేశారు. మార్చి మూడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రెండు రోజులపాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, మార్చి 1, 2 తేదీల్లో తిరుపతిలోని కౌంటర్లలో ఎస్ఎస్ఓ టోకెన్లు జారీ చేయబడవు.
తితిదే అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఆగమశాస్త్ర నియమాల అనుసరించి, గ్రహణ సమయంలో ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.
గ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటివాటిని తితిదే రద్దు చేసింది. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
భక్తులను రాత్రి 8:30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే, మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్ఓ టోకెన్లను యథావిధిగా మార్చి 3న జారీ చేయనున్నట్లు తితిదే తెలిపింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని తితిదే చేసింది.