Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు బంద్

Advertiesment
Montha Cyclone

ఠాగూర్

, మంగళవారం, 28 అక్టోబరు 2025 (17:46 IST)
మొంథా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా ఉంది. దీంతో ఏపీ సర్కారు ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులోభాగంగా, మంగళవారం రాత్రి 7 గంటల నుంచి కోస్తా జిల్లాల్లోని జాతీయ రహదారులపై అన్ని రకాల వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. తుఫాను దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే మినహా ప్రయాణాలు చేయవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 
 
మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ తుఫాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం రాత్రికి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగానికి చేరుకోవచ్చని తెలిపింది.
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రంలో తుఫాను ప్రభావంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాను తీరానికి సమీపిస్తుండటంతో దాని ప్రభావం ఇప్పటికే కోస్తా జిల్లాలపై మొదలైందని అధికారులు సీఎంకు వివరించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. 
 
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత తుఫానుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను తీరం దాటే కాకినాడ, పరిసర ప్రాంతాలకు జాతీయ విపత్తు స్పందన దళం, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలను వెంటనే పంపాలని ఆదేశించారు. గాలులు, వర్షాల తీవ్రతను ముందుగానే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
 
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సీఎంకు తెలిపారు. విశాఖపట్నంతో పాటు ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: విశాఖపట్నంలో మైదాన్ సాఫ్ కార్యక్రమం