Publish Date: Thu, 12 Sep 2019 (08:58 IST)
Updated Date: Thu, 12 Sep 2019 (09:00 IST)
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద రాతికొండల్లో డిఆర్డిఒ బుధవారం క్షిపణి ప్రయోగం చేసింది. రక్షణ శాఖ అధికారులు అత్యంత రహస్యంగా ఈ ప్రయోగం చేసినట్లు తెలిసింది. తక్కువ బరువు కలిగిన యాంటీ బ్యాంక్ గైడెడ్ మిసైల్ (ఎంపిఎటిజిఎం)ను పరీక్షించింది.
ఆర్మీ సహకారంతో ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికి ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా ఈ క్షిపణిని రూపొందించారు. 250 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తుందని తెలిసింది.
ఇటీవల డిఆర్డిఒ పాలకొలను వద్ద 2,700 ఎకరాల్లో భూసేకరణ చేసి తమ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ప్రహరీ మాత్రమే నిర్మాణంలో ఉంది. అయితే, క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ఎలక్ట్రానిక్ మీడియాకు విజువల్స్ విడుదల చేసింది.
క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ హైదరాబాద్ శాఖాధికారులను అభినందించినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.