Publish Date: Wed, 06 Mar 2019 (11:39 IST)
Updated Date: Wed, 06 Mar 2019 (11:41 IST)
కట్టుకున్న భార్యను భర్త పలు రకాలుగా వేధించాడు. చివరకు పరాయి పురుషునితో అక్రమ సంబంధం అంటగట్టాడు. ఈ వీడియోలు ఉన్నట్టు అత్తామామలకు చెప్పాడు. దీంతో తీవ్ర మానసకక్షోభకు గురైన ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో తేలప్రోలులో జరిగింది.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, తేలప్రోలుకు చెందిన అనిల్ అనే వ్యక్తికి సొంత మరదలు అయిన తోట్లవల్లూరు మండలం యాకమూరుకు చెందిన లక్ష్మీభవానీ (24)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. లక్ష్మీభవానీ రామవరప్పాడులోని ఓ కార్ల కంపెనీలో సేల్స్ ఉద్యోగినిగా, భర్త అనిల్ లారీడ్రైవర్గా పని చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో లక్ష్మీభవానీ తరచూ ఫోన్లో మాట్లాడసాగింది. దీంతో తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పడ్డారు. మాటలతో మానసికంగా వేధించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం అత్తమామలకు ఫోన్ చేసి మీ అమ్మాయి ప్రవర్తన బాగోలేదు.. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పాడు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మీభవానీ మంగళవారం ఇంట్లో ఉరేసుకుంది. బంధువులు ఆమెను చినఆవుట పల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.