ఏపీలోని ఒంగోలు జిల్లా మార్కాపురంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మార్కాపురం మండలంలోని రాయవరంలో చోటుచేసుకుంది.
మార్కాపురం గ్రామీణ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. దొనకొండ మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన వనమాల బ్రహ్మయ్య అనే వ్యక్తి మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన చెన్నమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కూలి పనుల కోసం ఇతర ప్రాంతానికి వలస వెళ్లిన సందర్భంగా భార్య చెన్నమ్మను భర్త కొట్టడంతో ఆమె పిల్లలను తీసుకని రాయవరంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో ఆదివారం మనస్తాపానికి గురైన భర్త పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలు అదుపు చేసి 108కు సమాచారం అందజేయడంతో సిబ్బంది వచ్చి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 40 శాతం కాలిన గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.