Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి పండుగ వెనుక చాలామందికి తెలియని సంగతులు

సంక్రాంతి పండుగ వెనుక చాలామందికి తెలియని సంగతులు
, గురువారం, 14 జనవరి 2021 (21:09 IST)
సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి...
 
సూర్యుని దివ్య యాత్రల్లో ప్రధాన ఘట్టాలలో మేష, తుల, మకర సంక్రమణలు ముఖ్యమైనవి సూర్యుడు మకర రాశి చేరగానే ప్రకృతిలో అనేక మార్పులు కలుగుతాయి.

ఆ మార్పుల చైతన్యమే ‘మకర సంక్రాంతి’ లో కనుపిస్తుంది. సంవత్సరాన్ని రెండు ఆయనములుగా మనం విభజించుకుంటున్నాం కనుక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకూ దక్షిణాయనం. మకర సంక్రమణం నుంచి కటక సంక్రమణం వరకూ ఉత్తరాయణం.
 
ఉత్తరాయణము దేవతా పూజకు, దక్షిణాయనము పితృదేవతారాధనకు ప్రధానం. ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్ళకు చేరుకుంటాయి. పశుపక్ష్యాదులు ఆనందంగా కనుపిస్తాయి.
 
వాస్తవానికి మన దేశంలో ప్రాకృతిక జీవనం అద్భుతంగా కనుపించేది ఈ పండుగ తరుణంలోనే. సూర్యుడు ధనూరాశి నుంచి మకర రాశికి ప్రవేశించగానే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ పల్లె ప్రజలను ఆనందంగా ఉంచే పండుగ పిల్లల్ని, పెద్దల్ని, ముఖ్యంగా రైతుల్ని ఆనందోత్సాహాలలో ఓలలాడించే ఈ పండుగ మూడు రోజులు సాగుతుంది.
 
పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది.

ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట !
 
సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు.

దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందికితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది !తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.
 
కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట.

దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.
 
సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.
 
సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ ఐదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది !

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిడ్నాప్ కేసులో అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్ : కరోనా ఫలితం ఏంటి?