Publish Date: Thu, 29 Aug 2019 (08:30 IST)
Updated Date: Thu, 29 Aug 2019 (08:32 IST)
ఈ మధ్య కాలంలో ట్విట్టర్లో రెచ్చిపోతున్న టీడీపీ యువనేత నారా లోకేష్.. తాజాగా వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.
"దొంగలు, అవినీతిపరులు, జైలుపక్షులు అధికారంలోకి వస్తే సంస్కారహీనులు ఇలాగే రెచ్చిపోతారు. అనూ రాజేశ్వరి అనే తెదేపా కార్యకర్త, ఒక బీసీ మహిళ. ఆమె కొడుక్కి లుకేమియా వ్యాధి వస్తే మానవత్వంతో ఆదుకున్న చంద్రబాబుగారు ఆమె దృష్టిలో దైవంతో సమానం.
రాజేశ్వరిగారు చంద్రబాబుగారిని కలవడానికి వచ్చినప్పటి ఫోటోలను పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసారు వైసీపీ వాళ్ళు. ఇక కామెంట్లు అయితే సభ్యసమాజం తలదించుకునేలా, అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి.
జగన్ గారూ! ఒక బీసీ మహిళను నీచంగా అవమానించిన వారి అహంకారానికి పార్టీపెద్దగా మీరు సమాధానం చెప్పాలి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తెదేపా కార్యకర్తలపై దాడులు చేసారు. ఆస్తులు కూల్చారు. ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఇలాంటి నీచమైన చర్యలకు దిగారు.
ఇక మీ ఆగడాలు సహించేది లేదు. ఏ రకంగా మిమ్మల్ని కట్టడి చేయాలో మాకూ తెలుసు. న్యాయపరంగా, హక్కులపరంగా మీకు బుద్ధి చెప్పేవరకు పోరాడుతాం. ఖబడ్ధార్" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.