Publish Date: Wed, 07 Aug 2019 (08:24 IST)
Updated Date: Wed, 07 Aug 2019 (08:26 IST)
టీడీపీ యువనేత లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఆయన ట్విట్టర్ లో ఏమన్నారంటే... "యథా సీఎం... తథా మంత్రి అన్నట్టు నోటికొచ్చిన అబద్ధాలతో ఎవరికివారు టీడీపీపై బురదచల్లేవారే కానీ ఈ ఆరోపణలపై కనీస అవగాహన కూడా ఉండటంలేదు వైసీపీ వాళ్ళకు. రిలయన్స్ కంపెనీ పేరుతో ఒక ఫేక్ కంపెనీని సృష్టించి 1000 ఎకరాలు కొట్టేసేందుకు టీడీపీ కుట్ర చేసిందని మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోపించారు.
బాధ్యతారహితంగా ఆరోపణ చేసేముందు కనీసం ఒక రెండు నిముషాలు బుర్ర పెడితే సమాచారం అంతా ఇంటర్నెట్లోనే దొరికేది. రిలయన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన సంస్థ. సంస్థ ఫైనాన్సియల్ స్టేట్ మెంట్లు కూడా విడుదల చేసింది చూడండి.
మంత్రిగారు ఈ సంస్థనే ఫేక్ కంపెనీ అంటున్నారు. ఫేక్ కంపెనీ ఎక్కడైనా ఫైనాన్సియల్ స్టేట్ మెంట్ లు రిలీజ్ చేస్తుందా? ఇది కూడా తెలీని వారు అక్రమాలపై లోతుగా విచారణ చేస్తారంట. మంత్రిగారూ! ఫేక్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే మీ అధినేత నేర చరిత్రను ఒకసారి చదువుకోండి" అని లోకేష్ మండిపడ్డారు.