Publish Date: Fri, 09 Jul 2021 (13:33 IST)
Updated Date: Fri, 09 Jul 2021 (13:35 IST)
తిరుమలలో వరుస చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న ఘాట్ రోడ్డులో ఓ చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన భక్తులు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. అటువైపుగా కారులో వెళ్తున్న కొందరు.. పులి పరుగులను తమ సెల్ఫోన్లలో బంధించారు. అనంతరం టీటీడీ, అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు.
ఇక.. ఈ ఘటన మరుకవ ముందే.. తిరుమలలో మరోసారి భక్తుల కంటపడింది చిరుత. వేకువజామున సన్నిధానం అతిథి గృహం దగ్గర మరోసారి హల్చల్ చేసింది. ఓ పందుల గుంపును తరుముకుంటూ ముందుకెళ్లింది. దీనిని గమనించిన ఓ రెస్టారెంట్ సిబ్బంది.. అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు, టీటీడీ సిబ్బందికి సమాచారమిచ్చారు.
చిరుత పులి సంచారంతో తిరుమల కొండపై భక్తులు, సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. దీనిపై టీటీడీ, అటవీశాఖ దర్యాప్తు చేస్తోంది. భక్తులు, టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.