సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఒక సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదాను రాబట్టుకునే విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో వెంకయ్యను సీమాంధ్ర ప్రజలు ఓ దోషిగా చూస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్య విలన్ కాదనీ, సీమాంధ్ర హీరో అని నిరూపించుకోవాలని సూచించారు. ఈ మేరకు వెకయ్యకు కేవీపీ ఓ లేఖ కూడా రాశారు. ఆ రోజు రాజ్యసభలో సుదీర్ఘ ప్రసంగం చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేసే అనేక క్లాజులపై మాట్లాడిన మీరు... తర్వాత వాటిని ఉపసంహరించుకున్న విషయం తెలుగు ప్రజలకు తెలియదు. ప్రత్యేక హోదా చట్టంలో లేదని ఇపుడు మీరంటున్నారు... మరి ఆ రోజు చట్టంలో చేర్చేలా ఎందుకు క్లాజుల సవరణలకు పట్టుబట్టలేదని కేవీపీ ప్రశ్నించారు.
ఆ రోజు మీరు ప్రసంగంలో త్వరలో బీజేపీ అధికారంలోకి వచ్చి మీరిప్పుడు చేయని అన్ని చేస్తుందని చెప్పారు... అవన్నీ ఉట్టి మాటలేనా అని కేవీపీ నిలదీశారు. ఇప్పటికైనా తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లును సమర్ధించాలని కేవీపీ కోరారు. ఆ రోజు రాజ్యసభలో వెంకయ్య చూపిన హావభావాలు, వాక్పటిమ చూసి... ఒకే ఒక్కడు అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు అదే కారణం. అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాటలకు ఇప్పుడు మీరు విలువ ఇవ్వడం లేదు. ఇప్పటికీ ప్రధాని మోడీ మిమ్మల్ని తప్ప ఎవరినీ పొగడరు. కాబట్టి మీరే ప్రధానిని ఒప్పించి, మెప్పించి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ప్రైవేటు బిల్లుకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.