Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రాను హడలెత్తిస్తున్న చెన్నై కోయంబేడు - కారణం ఏంటంటే?

ఆంధ్రాను హడలెత్తిస్తున్న చెన్నై కోయంబేడు - కారణం ఏంటంటే?
, శుక్రవారం, 15 మే 2020 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, తమిళనాడు సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, నెల్లూరులో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి కారణం చెన్నై కోయంబేడు మార్కెట్టే కారణం. ఈ మార్కెట్‌కు వెళ్లివచ్చిన వారిలో అనేక మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా, చెన్నైతో పాటు.. పలు జిల్లాలకు కరోనా వైరస్ వ్యాప్తికి ఈ కోయంబేడు మార్కెట్ ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. అలాగే, ఈ కోయంబేడు మార్కెట్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా పడుతోంది. 
 
తాజాగా ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చిన వారితో కేసులు మరిన్ని పెరిగాయి. దీనికి తోడు వలస కార్మికుల రాక కూడా కేసుల పెరుగుదలకు మరో కారణం. రాష్ట్రంలో గురువారం 68 కేసులు నమోదు కాగా, అందులో 21 కేసులు కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవే కావడం గమనార్హం.
 
వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన 12 మంది, చిత్తూరు జిల్లాకు చెందిన 8 మంది, పశ్చిమ గోదావరికి చెందిన ఒకరు ఉన్నారు. ఇక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 32 మంది కరోనా బాధితులుగా మారారు. ఒక్క మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలోనే 29 మందికి కరోనా సోకగా, ఒడిశా నుంచి వచ్చిన ఇద్దరికి, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.
 
కోనసీమలో కరోనా కలకలం 
మరోవైపు, పచ్చటి కోనసీమలో చెన్నై కోయంబేడు మార్కెట్ కలకలం రేపుతోంది. దీనికి కారణం కరోనా వైరస్సే. ఈ మార్కెట్‌కు రాకపోకలు సాగించిన అనేక లారీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు, కొనుగోలుదార్లకు ఈ వైరస్ సోకింది. ఇప్పటికే చెన్నై నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదవుతున్న కరోనా కేసులకు కేంద్ర బిందువుగా చెన్నై కోయంబేడు మారింది. 
 
ఈ మార్కెట్‌కు వెళ్లొచ్చిన అనేక మంది ఆంధ్రా వ్యాపారులు, పౌరులు ఈ వైరస్ బారినపడటం ఇపుడు అక్కడ కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ మార్కెట్ కారణంగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దీని ఎఫెక్ట్ జిల్లాలను దాటుకుని తూర్పుగోదావరి జిల్లా కోనసీమను తాకింది. 
 
కోయంబేడు మార్కెట్ కు వెళ్లొచ్చిన పలువురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అమలాపురంలో రెండు పాజిటివ్ కేసులు తేలాయి. బండారులంకలో ఓ వ్యాన్ డ్రైవర్‌కు పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆయన ద్వారా భార్యకు వైరస్ సోకింది.
 
మరోవైపు కొత్తపేట మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏనుగుల మహల్‌కు చెందిన ఇద్దరికి, బోడిపాలెంకు చెందిన మరొక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు ఈ నెల 10న కోయంబేడు నుంచి రావులపాలెం చేరుకున్నారు. 
 
అయితే కరోనా అనుమానం రావడంతో ఇళ్లకు వెళ్లకుండా... కొత్తపేట సమీపంలో ఉన్న ఓ లంకలో తలదాచుకుని, అధికారులకు సమాచారాన్ని అందించారు. అధికారులు వీరికి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో, ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు ఇస్తానని పిలిచి మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు